PROPERTY: ఆస్తి పంపకం విషయంలో గొడవ.. కన్న తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!

  • ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘటన
  • అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన తల్లి
  • కొనప్రాణాలతో ఆసుపత్రిలో తండ్రి పోరాటం

ఆస్తి పంచాలన్న డిమాండ్ కు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఓ కొడుకు రాక్షసుడిగా మారిపోయాడు. అసలు మీవల్లే ఈ సమస్యలు వచ్చాయంటూ తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మంటలకు హాహాకారాలు చేస్తూ తల్లి అక్కడికక్కడే చనిపోగా, తండ్రి తీవ్రంగా గాయపడి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

అనంతపురంలోని కనేల్ లో మధుసూదన్ రెడ్డికి ఆస్తి పంపకం విషయంలో తల్లిదండ్రులతో ఈరోజు గొడవ జరిగింది. దీంతో రెచ్చిపోయిన మధుసూదన్ రెడ్డి తల్లి నర్సమ్మ, తండ్రి నారాయణరెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. వీరి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కలవారు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు నర్సమ్మ అప్పటికే చనిపోయినట్లు తేల్చారు.

ఇక నారాయణరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు మరింత మెరుగైన చికిత్స కోసం బళ్లారి నిమ్స్ కు తరలించారు. మరోవైపు ఈ ఘటనపై నారాయణరెడ్డి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మధుసూదన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.

More Telugu News