టీడీపీ ఎమ్మెల్యే సండ్ర విన్నపం.. వెంటనే ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హైదరాబాదులోని ప్రగతి భవన్ లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేడు కలిశారు. ఖమ్మం జిల్లాలో పంటలను కాపాడేందుకు నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ ను కోరారు. ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మెట్ట, ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారని... పది రోజుల పాటు నీటిని అందించి పొలాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందించారు. సండ్ర విన్నపానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. నీటిని విడుదల చేయాలంటూ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు.