mohanbabu: నోటితో పొగిడి నొసటితో వెక్కిరిస్తారా?: చంద్రబాబుపై మోహన్‌బాబు ఫైర్‌

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయక పోవడంపై ఆగ్రహం
  • మా విద్యా సంస్థల పనితీరు బాగుందన్నది మీరే కదా
  • మరి నిధుల విడుదలకు మోకాలడ్డుతున్నారెందుకని ప్రశ్న

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదల విషయంలో చొరవ చూపడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ఫైర్‌ అయ్యారు. 2014-15 విద్యా సంవత్సరం నుంచి తమ సంస్థ విద్యార్థుల ఫీజులు ఇవ్వలేదని, అప్పుడప్పుడూ తమ కళాశాలకు భిక్షం మాత్రం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈరోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు తనకెంతో సన్నిహితుడని, ఒకప్పుడు తమ విద్యానికేతన్‌, కళాశాల గొప్పదని ఆయనే అంటే పొంగిపోయానని అన్నారు. విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఇస్తామని ఆ సందర్భంలో హామీ ఇచ్చినా చంద్రబాబు మాటనిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టు’ అమలు కాని హామీలు, మాటలు ఎందుకన్నారు.

విద్యాభివృద్ధికి ఏపీ సర్కారు సరిగా పనిచేయడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని సాక్షాత్తు చంద్రబాబుకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తిని కాదని, తక్షణం తమ ఆవేదనను అర్థం చేసుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని కోరారు.

More Telugu News