India: భారత్, పాకిస్థాన్ ల ఉమ్మడి శత్రువు ఉగ్రవాదమే.. మనం ఇంకా ఎంత రక్తం చిందించాలి?: మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్

  • ఇరుదేశాలు ప్రస్తుతం సంయమనం పాటించాలి
  • ఉగ్రవాదంపై భారత్, పాక్ కలిసి పోరాటం చేయాలి
  • ట్విట్టర్ లో స్పందించిన పాక్ మాజీ క్రికెటర్

భారత్, పాకిస్థాన్ లకు ఉగ్రవాదమే ఉమ్మడి శత్రువని పాక్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ తెలిపారు. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరుదేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఈరోజు వసీమ్ అక్రమ్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘భారత్‌కు భారమైన హృదయంతో చెబుతున్నా. పాకిస్థాన్ మీ శత్రువు కాదు. మీ శత్రువూ, మా శత్రువూ ఉగ్రవాదమే. దీనిపై రెండు దేశాలూ కలిసి పోరాడితేనే ప్రయోజనం ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవడానికి రెండు దేశాలూ ఇంకా ఎంత రక్తం చిందిస్తాయి?’ అని ట్వీట్ చేశారు.

పాకిస్థాన్ లోని జైషే ఉగ్రస్థావరాలపై గత మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో దాదాపు 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీంతో వెంటనే స్పందించిన పాకిస్థాన్ మరుసటి రోజు భారత ఆర్మీ స్థావరాలపై వైమానిక దాడులకు సిద్ధమవగా, భారత్ వాయుసేన అడ్డుకుంది. ఈ సందర్భంగా మిగ్-21 నడుపుతున్న అభినందన్ వర్ధమాన్ అనే భారత పైలట్ పాక్ ఆర్మీకి చిక్కారు.

More Telugu News