Andhra Pradesh: వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించిన టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విమర్శలు గుప్పించారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు ఏమిటో ఆయనకే తెలియదని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలనే జగన్ నవరత్నాలుగా ప్రకటించారని ఆరోపించారు. జగన్ కు ప్రజా సమస్యలు పట్టవనీ, బెంగళూరు, హైదరాబాద్ లోని ఆస్తులను కాపాడుకోవడానికే ఆయనకు సమయం సరిపోతోందని దుయ్యబట్టారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జలీల్ ఖాన్ మాట్లాడారు.

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారని జలీల్ ఖాన్ విమర్శించారు. కేంద్రం కేవలం మొక్కుబడిగా విశాఖ రైల్వేజోన్ ను ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేస్తున్న మోసాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి ప్రశ్నించిన ఏకైక నేత చంద్రబాబేనని స్పష్టం చేశారు.

ఫత్వా అనే మతపరమైన విశ్వాసాన్ని రాజకీయంగా వాడుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయకుండా ఫత్వా ఇవ్వాలని టీడీపీ నేత, మాజీ మేయర్ మల్లికాబేగం ఇటీవల డిమాండ్ చేసిన నేపథ్యంలో జలీల్ ఖాన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
jaleel khan
criticise

More Telugu News