jagan: జగన్ మోదీ రెడ్డి గారికి శుభాకాంక్ష‌లు: నారా లోకేష్ వ్యంగ్యం

  • అమరావతిలోనే ఉండిపోతారనుకున్నా
  • ఒక్క రోజు కూడా ఉండలేకపోయారు
  • రైల్వే జోన్ కుట్రలో మీరు కూడా భాగస్వామి అయ్యారు

అమరావతి సమీపంలో ఉన్న తాడేపల్లిలో నూతన గృహప్రవేశం చేసిన వైసీపీ అధినేత జగన్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో ఆయనపై సెటైర్లు వేశారు. భ్రమరావతి అన్న మీరు నాలుగు సంవత్సరాల 10 నెలల తర్వాతైనా అమరావతికి వచ్చారని, ఇక్కడే ఉండిపోతారని అనుకున్నానని... కానీ ఒక్కరోజు కూడా అమరావతిలో ఉండకుండా లోటస్ పాండ్ కు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.

మీరు అమరావతి ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే రైల్వే జోన్ వచ్చిందని వైసీపీ నేతలు స్వీట్లు పంచుకున్నారని... మీ గృహప్రవేశానికి కానుకగా ప్రధాని మోదీ రైల్వే జోన్ ను కానుకగా ఇచ్చారని సంబరాలు చేసుకున్నారని అన్నారు. మీ గృహప్రవేశం సందర్భంగా ఏడాదికి రూ. 6500 కోట్ల ఆదాయాన్ని తెచ్చే వాల్తేరు డివిజన్ ను ఒడిశాకు మోదీ కానుకగా ఇచ్చి ఏపీకి మరో అన్యాయం చేశారని విమర్శించారు. మోదీతో జోడీ కట్టి రైల్వే జోన్ కుట్రలో మీరు కూడా భాగస్వామి అయిపోయారనే విషయం అర్థమైపోయిందని అన్నారు.

More Telugu News