DL Ravindra Reddy: ఏ పార్టీ అన్నది 8వ తేదీనే చెబుతా: డీఎల్ రవీంద్రారెడ్డి

  • ప్రస్తుతం కాంగ్రెస్ కు దూరంగా ఉన్న డీఎల్
  • 8న కార్యకర్తలతో సమావేశం
  • చర్చించి నిర్ణయం చెబుతానన్న డీఎల్

త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను మైదుకూరు నుంచి పోటీకి దిగనున్నానని, అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న విషయాన్ని మార్చి 8న వెల్లడిస్తానని గత కొంతకాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న డీఎల్ రవీంద్రా రెడ్డి వెల్లడించారు. ఓ దినపత్రికతో మాట్లాడిన ఆయన, స్వతంత్ర అభ్యర్థిగానా? లేక ఏదైనా పార్టీ తరపున పోటీ చేయాలా అన్న విషయాన్ని కార్యకర్తలతో చర్చించి నిర్ణయించుకుంటానని అన్నారు.

కాగా, ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాలతో విభేదించి, కాంగ్రెస్ కు దూరమైన ఆయన, అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన ఆయన, ఆపై ఆ పార్టీకి కూడా దూరమయ్యారు. ఇప్పుడు తిరిగి ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుండగా, డీఎల్ కు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేమని, పార్టీలో చేరి, అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తే ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడించినట్టు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కూడా కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు. ఆ సమయంలో మైదుకూరు టికెట్ తనకే లభిస్తుందని ఆయన చెప్పగా, ఆ స్థానం తనదేనంటూ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ చెప్పడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ నెలకొంది.

More Telugu News