Tammareddy Bharadwaja: పవన్‌లో ఆవేశం తప్ప ఆలోచన ఏదీ?: తమ్మారెడ్డి

  • ప్రజారాజ్యంలో జరిగిన తప్పులు జరక్కుండా చూసుకోవాలి
  • జనసేనలో ఎవరు ఎలాంటి వారో అర్థం కావడం లేదు
  • చిరంజీవి ప్రజారాజ్యం ఓడిపోవడానికి కారణం అదే

రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారాన్ని చేజిక్కించుకుంటారా? అధికారాన్ని సొంతం చేసుకోవాలంటే ఆయన ఎటువంటి విధానాలను అనుసరించాల్సి ఉంటుంది.. అన్న విషయాలపై  టాలీవుడ్ సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీల కంటే వ్యక్తుల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని.. చంద్రబాబు, జగన్, పవన్.. వీరి వ్యక్తిత్వాలు చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉందని తమ్మారెడ్డి పేర్కొన్నారు. పవన్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడని చెబుతున్నా ఆయనలో ఆవేశం తప్ప ఆలోచన కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. గతంలో ప్రజారాజ్యంలో జరిగిన తప్పులే ఇప్పుడు పవన్ జనసేనలో జరుగుతున్నట్టు అనిపిస్తోందని, అలా జరక్కుండా చూసుకోవాలని సూచించారు. పార్టీలోకి పాతవారినే తీసుకోవడం వల్ల వారిలో మంచివారెవరో, చెడ్డవారు ఎవరో తేల్చుకోవడం కష్టమవుతోందన్నారు.  

చిరంజీవి దేనికైనా కొంత తలొగ్గుతారని, ఆయనలో మెతకదనం ఉందన్న తమ్మారెడ్డి.. ఆ మెతకదనం వల్ల ఆయనకు నష్టం జరిగిందన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడానికి ఆ మెతకవైఖరే కారణమన్నారు. అదే మెతకవైఖరి ఆయనను మెగాస్టార్‌ను చేసిందన్నారు. చిరంజీవిలో ఓ సుగుణం ఉందని, తాను పట్టిన దానికి మూడే కాళ్లు అనరని, ఏదైనా ఓ విషయాన్ని పదిమందితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటారని తమ్మారెడ్డి విశ్లేషించారు.  

More Telugu News