Nara Lokesh: బిడ్డ పుట్టగానే తల్లిని చంపిన నరేంద్ర మోదీ: రైల్వే జోన్ పై లోకేశ్ విసుర్లు

  • నమ్మించి మోసం చేసిన నరేంద్ర మోదీ
  • విశాఖ జోన్ కు వాల్తేరు డివిజన్ తల్లి వంటిది
  • జోన్ ఏర్పాటులోనూ అన్యాయం

విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వే జోన్ ను ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ వెల్లడించిన తరువాత, ఏపీ మంత్రి నారా లోకేశ్, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. నరేంద్ర మోదీ నమ్మించి మోసం చేస్తారని మరోసారి రుజువైందని ఆయన నిప్పులు చెరిగారు. బిడ్డకు (విశాఖ జోన్)కు జన్మనిచ్చిన తల్లి (వాల్తేర్ డివిజన్)ని చంపేశారని ఆరోపించారు.

జోన్ ఏర్పాటులోనూ రాష్ట్ర విభజనలా అన్యాయం చేశారని మండిపడ్డ ఆయన, నాడు ఎక్కువ ఆదాయం ఉన్న హైదరాబాద్ ను తెలంగాణకు ఇచ్చారని, ఇప్పుడు సాలీనా రూ. 6,500 కోట్లు తెచ్చే వాల్తేర్ డివిజన్ ను ఒడిశాకి అప్పజెప్పారని ఆరోపించారు. సరకు రవాణా ద్వారా అధిక ఆదాయం తెచ్చే తలను రాష్ట్రానికి దక్కకుండా చేశారని అన్నారు. ఏడాదికి రూ. 500 కోట్లు కూడా రాని ప్రయాణికుల ఆదాయం మాత్రమే రాష్ట్రానికి మిగిలిందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. మోదీ మార్క్ మోసం అంటే ఇదేనని చెప్పుకొచ్చారు.

More Telugu News