Andhra Pradesh: నెల్లూరులో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. విశ్రాంత మహిళా ఉద్యోగి దారుణహత్య!

  • జిల్లా కేంద్రంలోని నేతాజీ నగర్ లో ఘటన
  • ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తింపు
  • ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు కొందరు ఓ రిటైర్డ్ మహిళా ఉద్యోగిని దారుణంగా హత్యచేశారు. అనంతరం ఇంట్లోని నగదు, నగలను దోచుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని నేతాజీనగర్ లో వసంత కుమారి అనే రిటైర్డ్ ఉద్యోగి ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉంటోందని గమనించిన దుండగులు ఈరోజు తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడ్డారు.

అయితే ఇంట్లో అలికిడికి వసంత కుమారి మేల్కొనడంతో వెంటనే ఆమె గొంతు నులిమి దారుణంగా హతమార్చారు. అనంతరం ఇంట్లోని ఆభరణాలు, నగదును తీసుకుని ఉడాయించారు. వసంత కుమారి ఈరోజు ఉదయం బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు కిటికీ నుంచి లోనికి తొంగిచూశారు. ఆమె మంచంపై అచేతనంగా పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన అధికారులు.. కేసు నమోదుచేశారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. అనంతరం మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆభరణాలు, నగదు కోసమే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.

More Telugu News