Andhra Pradesh: రాక్షసుడిగా మారిన టీచర్.. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం!

  • ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఘటన
  • మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టిన ఉపాధ్యాయుడు
  • దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు రాక్షసుడిగా మారాడు. మద్యం మత్తులో కళ్లు మూసుకుపోయి తన దగ్గర చదువుతున్న అమ్మాయిపైనే అత్యాచారం చేశాడు. దీంతో బాలిక అరుపులు విన్న స్థానికులు సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని దేవరాపల్లి మండలం వాకపల్లికి చెందిన ఓ బాలిక శిరజాం శివారు ఎల్ఎన్ పురం ఎంపీపీ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రోజూ స్నేహితులతో కలిసి ఆమె ఆటోలో స్కూలుకు వెళుతోంది. ఇటీవల సదరు బాలిక తల్లి చనిపోవడంతో ఉదయాన్నే తమ్ముడు, తండ్రికి భోజనం వండి పాఠశాలకు వెళుతుంది. ఈ క్రమంలో మంగళవారం భోజనం వండి బయలుదేరడంలో ఆలస్యం కావడంతో ఆటో వెళ్లిపోయింది. దీంతో సదరు బాలిక నడుచుకుంటూ స్కూలుకు బయలుదేరింది.

ఈ నేపథ్యంలో అటుగా వచ్చిన టీచర్ గుమ్మాల కొండబాబు ఆమెను బైక్ పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా బాలిక కేకలు విన్న స్థానికులు కొండబాబును పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నిందితుడు పూటుగా మద్యం సేవించి విద్యార్థినిపై లైంగికదాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, కొండబాబును సస్పెండ్ చేస్తూ డీఈవో లింగేశ్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

More Telugu News