Jagan: చంద్రబాబుకు ఏపీలో ఓటు లేదు, ఆఫీసు లేదు, సొంతిల్లు లేదు: రోజా విసుర్లు!

  • రాజధానికి జగన్ వ్యతిరేకమని తప్పుడు ప్రచారం
  • ఇప్పటివరకూ సొంత ఇంటి ఆలోచన కూడా చేయని చంద్రబాబు
  • చంద్రబాబు టెంపరరీ సీఎం మాత్రమేనన్న రోజా

అమరావతిలో రాజధానికి వైఎస్ జగన్ వ్యతిరేకమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. ఈ ఉదయం అమరావతి ప్రాంతంలో జగన్ గృహ ప్రవేశం చేయగా, ఈ కార్యక్రమానికి వచ్చిన రోజా మీడియాతో మాట్లాడారు. జగన్ గృహ ప్రవేశం టీడీపీ నేతలకు, ముఖ్యంగా చంద్రబాబుకు చెంపపెట్టు వంటిదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు లేని చంద్రబాబు, అమరావతిలో కనీసం సొంత ఇంటి ఆలోచన చేయకుండా అద్దె ఇంట్లో ఉంటూ, హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉండాలన్న చిత్తశుద్ధితోనే రాజధానిలో సొంత ఇంటిని, శాశ్వత పార్టీ కార్యాలయాన్ని జగన్ నిర్మించారని చెప్పారు. రాజధాని ప్రాంతంలో తాను చేసిన దోపిడీ డబ్బుతో చంద్రబాబు హైదరాబాద్ లో ఇంద్రభవనాన్ని నిర్మించుకున్నారని రోజా ఆరోపించారు.

టెంపరరీ కట్టడాలతో సరిపెడుతున్న చంద్రబాబు టెంపరరీ సీఎం మాత్రమేనని, పర్మినెంట్ సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. తాను ఓడిపోతానని తెలిసే చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News