Bangladesh: కాల్చి చంపాక తెలిసింది.. అతడి వద్ద ఉన్నది బొమ్మ తుపాకి అని: విమాన హైజాక్ ఉదంతంలో కొత్త కోణం

  • బంగ్లాదేశ్ విమానాన్ని హైజాక్ చేసిన దుండగుడు
  • కాల్చి చంపిన భద్రతా దళాలు
  • భార్యతో గొడవే హైజాక్‌కు కారణమని తేల్చిన అధికారులు

బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని భద్రతా దళాలు కాల్చి చంపిన తర్వాత ప్రాథమిక విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ప్రయాణికులను బెదిరించేందుకు హైజాకర్ వాడింది బొమ్మ తుపాకీ అని తేలింది. భార్యతో వ్యక్తిగత గొడవల కారణంగానే విమానాన్ని హైజాక్ చేశాడని, అతడి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని అధికారులు తెలిపారు. అయితే, సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని, ఇప్పుడే ఓ నిర్ధారణకు రాలేమని పేర్కొన్నారు.

ఆదివారం 148 మంది ప్రయాణికులతో ఢాకా నుంచి దుబాయ్ బయలుదేరిన విమానంలో ఓ వ్యక్తి తుపాకితో బెదిరించి కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. తుపాకి చూపిస్తూ తన వద్ద పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయని ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా  ఛత్రోగ్రామ్‌ విమానాశ్రయంలో దించారు. రంగంలోకి దిగిన భద్రతా దళాలు హైజాకర్‌తో మాట్లాడి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు. అనంతరం హైజాకర్‌ను కాల్చి చంపారు.

కాగా, హైజాకర్ ఉపయోగించింది బొమ్మ తుపాకియే అయినా అది విమానంలోకి ఎలా తీసుకురాగలిగాడనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వద్ద ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు. 

More Telugu News