priyanka gandhi: సోదరుడి కోసం ప్రియాంక ‘సంకల్ప్‌'.. 28న గుజరాత్‌లో భారీ ర్యాలీ

  • సోనియా, రాహుల్‌తో కలిసి  నిర్వహణ
  • ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ
  • ఉత్తరప్రదేశ్‌ తూర్పు బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షుడు

ఇటీవలే అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి స్వీకరించిన ప్రియాంకాగాంధీ పార్టీకి పునర్‌ వైభవం తెచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారనిపిస్తోంది. దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని తన సోదరుడు రాహుల్‌గాంధీ బాధ్యతలు అప్పగించడంతో ఆ పనిలో ఉన్న ప్రియాంక పనిలో పనిగా మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌పైనా దృష్టిసారించినట్టున్నారు.

ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో రోడ్‌ షో నిర్వహించిన ఆమె ఈనెల 28వ తేదీన గుజరాత్‌లో తొలిసారి ‘సంకల్ప్‌ ర్యాలీ’ నిర్వహించాలని నిర్ణయించారు. తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్‌గాంధీతో కలిసి ప్రియాంక ఈ ర్యాలీ నిర్వహించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ ర్యాలీతో పునరుజ్జీవం పోయాలని ఆమె భావిస్తున్నారు.

అహ్మదాబాద్‌లో జరిగే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం అనంతరం ఈ ర్యాలీ జరగనుందని, ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడనున్నారని సమాచారం. ప్రియాంక ర్యాలీ నేపథ్యంలో పార్టీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

More Telugu News