Chandrababu: ఆ పథకాలన్నీ కేంద్రానివే.. చంద్రబాబు స్టిక్కర్ బాబులా మారిపోయారు: జీవీఎల్

  • కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ వేస్తున్నారు
  • ఏపీ అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్రానివే
  • రైతులు కాని వారి అకౌంట్లలోకి డబ్బులు వెళుతున్నాయి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరోసారి మండిపడ్డారు. మహాకూటమిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ బజ్వాలను కూడా చేర్చుకున్నట్టు కనిపిస్తోందని అన్నారు. రాజకీయాల కోసం జాతీయ భద్రతను, పుల్వామా దాడిని వాడుకోవద్దని సూచించారు. ఇలాంటి తప్పులకు పాల్పడితే ప్రజలు క్షమించరని అన్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయని మండిపడ్డారు. గత నాలుగున్నరేళ్లలో ఏం చేశారో చెప్పకుండా... ఇతర పార్టీలపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారని అన్నారు. తెలంగాణలో టీడీపీని తిరస్కరించారని... ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతోందని చెప్పారు.

కేంద్రం చేస్తున్న ప్రతి పనికి రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ వేసుకుంటున్నారని జీవీఎల్ అన్నారు. చంద్రబాబు స్టిక్కర్ బాబులా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీ అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్రానివే అని చెప్పారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో నిజమైన రైతులకు అన్యాయం జరుగుతోందని... రైతులు కానీ వారి అకౌంట్లలోకి డబ్బులు వెళుతున్నాయని ఆరోపించారు.

More Telugu News