pulwama: మన రైతుల సంచలన నిర్ణయం... పాక్ లో ఆకాశాన్నంటిన టమోటా ధరలు

  • పాక్ కు టమోటా ఎగుమతి చేయరాదంటూ మధ్యప్రదేశ్ రైతుల నిర్ణయం
  • ఢిల్లీలోని అజాద్ పూర్ మండీ నుంచి కూడా ఎగుమతులు బంద్
  • లాహోర్ లో రూ. 180కి పెరిగిన టమోటా ధర

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ కు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ దేశానికి టమోటాల ఎగుమతిని ఆపివేస్తూ మధ్యప్రదేశ్ లోని జబువా జిల్లా రైతులు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 5వేల మంది రైతులు ఈ జిల్లాలో టమోటాను పండిస్తున్నారు. ఇక్కడి నుంచి పాకిస్థాన్ కు టమోటా ఎగుమతి అవుతోంది.

ఈ సందర్భంగా రవీంద్ర పటిదార్ అనే రైతు మాట్లాడుతూ, 'మేము టమోటాను సాగు చేస్తున్నాం. పాకిస్థాన్ కు కూడా ఎగుమతి చేస్తున్నాం. మన ఆహారాన్ని తింటూ మన జవాన్లనే వారు చంపుతున్నారు. పాకిస్థాన్ నాశనం కావాలని మేము కోరుకుంటున్నాం. ఇతర దేశాలు కూడా పాకిస్థాన్ కు టమోటాను ఎగుమతి చేయరాదని మేము కోరుతున్నాం' అని చెప్పారు.

పాకిస్థాన్ కు టమోటాను ఎగుమతి చేయడం ద్వారా తాము ఎంత సంపాదిస్తామనేది ముఖ్యం కాదని బసంతిలాల్ పటిదార్ అనే రైతు చెప్పారు. సైన్యమే లేకపోతే మనం ఎలా బతుకుతామని... ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏం చేసుకుంటామని ప్రశ్నించారు.

మరోవైపు దేశంలోనే అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్ అయిన ఢిల్లీలోని అజాద్ పూర్ మండీ నుంచి పాకిస్థాన్ కు భారీ ఎత్తున కాయగూరలు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడి నుంచి ప్రతి రోజు 75 నుంచి 100 ట్రక్కుల టమోటా పాకిస్థాన్ కు వెళుతుంది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ కు ఎలాంటి ఉత్పత్తులనూ సరఫరా చేయకూడదని ఈ మండీ కూడా నిర్ణయించింది.

ప్రస్తుతం భారత్ లో కేజీ టమోటా రూ. 10 ఉండగా... పాకిస్థాన్ లోని లాహోర్ లో కేజీ రూ. 180కి పెరిగింది. పెరిగిన టమోటా ధరలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రైతులు తీసుకున్న నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రశంసించారు. రైతులకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. 

More Telugu News