Andhra Pradesh: కర్నూలు టీడీపీలో రగడ.. సీఎం చంద్రబాబుతో ఎస్వీ మోహన్ రెడ్డి భేటీ!

  • కర్నూలులో పోటీచేయాలని లోకేశ్ చెప్పారు
  • ఆయన మాటకు కట్టుబడి ఉన్నాను
  • మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత

కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయం మరింత ముదిరింది. టీడీపీ నేతలు ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్ కర్నూలు సీటును ఆశిస్తున్న నేపథ్యంలో మోహన్ రెడ్డి ఈరోజు అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. కర్నూలు సీటు విషయమై చంద్రబాబుతో చర్చించారు. అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు.

కర్నూలు అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలని మంత్రి నారా లోకేశ్ తనకు చెప్పారనీ, ఆయన మాటకు కట్టుబడి ఉన్నానని ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. తాను ఏ నేతపై కూడా చంద్రబాబుకు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఈరోజు జరిగే కర్నూలు పార్లమెంటరీ సమీక్షలో ఈ విషయమై స్పష్టత వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కర్నూలు లోక్ సభ స్థానానికి బుట్టా రేణుకను, అసెంబ్లీ స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డిని గెలిపించాలని ఇటీవల జరిగిన ఓ సభలో మంత్రి లోకేశ్ ప్రజలను కోరారు. దీనిపై ఎంపీ టీజీ వెంకటేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో అంతిమ నిర్ణయం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు.

More Telugu News