TS RTC: టీఎస్‌ఆర్టీసీ వోల్వో బస్సులో మంటలు... అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం

  • విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఘటన
  • షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
  • మంటల్ని అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

ప్రయాణిస్తున్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయకంపితులయ్యారు. డ్రైవర్‌ బస్సు నిలపగానే కిందికి పరుగందుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ సంస్థకు చెందిన వోల్వో బస్సులో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన కాసేపు టెన్షన్‌కు కారణమైంది.

వివరాల్లోకి వెళితే...టీఎస్‌ ఆర్టీసీకి చెందిన ఈ బస్సు  50 మంది ప్రయాణికులతో ఉదయం హైదరాబాద్‌ కు బయలుదేరింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్దకు బస్సు వచ్చేసరికి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను దించేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్‌ వైరింగ్‌లో షార్ట్‌ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు.

More Telugu News