Parvej Musharaf: పాక్‌లోని ఐదు పాయింట్లలో నాలుగింటిలోని మా సైన్యాన్ని భారత దళాలు టచ్ కూడా చేయలేవు: ముషారఫ్

  • పుల్వామా దాడిని ఖండిస్తున్నాం
  • పాక్‌ను తప్పుబట్టడం సరికాదు
  • దాడులు చేస్తామంటే దారుణంగా నష్టపోతుంది
  • అమెరికాతో మంచి సంబంధాలే ఉన్నాయి

పాకిస్థాన్‌లోని ఐదు పాయింట్లలో నాలుగు పాయింట్లలోని తమ సైన్యాన్ని భారత దళాలు టచ్ కూడా చేయలేవని పాక్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ధీమా వ్యక్తం చేశారు. నేడు ఓ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. పుల్వామా దాడిని తాను ఖండిస్తున్నానని చెబుతూ, దాడిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందంటూ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. దాడి జరిగిన మరుసటి రోజే పాక్‌ను భారత్ తప్పుబట్టడం సరికాదని, ఘటన జరిగిన గంటల్లోనే అసలెలా తప్పుబడతారని ప్రశ్నించారు.

పుల్వామా దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన జైషే ఉగ్రవాద సంస్థను పాక్ ఉపేక్షించదన్నారు. జైషేపై నిషేధం విధించాలని, ఆ సంస్థ చీఫ్ మసూద్‌పై తమకేమాత్రం సానుభూతి లేదని ముషారఫ్ స్పష్టం చేశారు. పుల్వామా దాడిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ హస్తం లేదని ఆయన వెల్లడించారు. భారత్‌లో ‘ఉరి’ ఘటన తరువాత పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ సర్జికల్ దాడులు జరిపిందనడంలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. పాక్‌పై దాడులు చేస్తామని భారత్ హెచ్చరిస్తే కనుక తనే దారుణంగా నష్టపోతుందన్నారు.

పాక్‌లోని ఐదు పాయింట్లలో నాలుగు పాయింట్లలోని తమ సైన్యాన్ని భారత దళాలు టచ్ కూడా చేయలేవని ముషారఫ్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికాతో తమకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. పాక్‌ కూడా ఉగ్రవాద బాధిత దేశమని ముషారఫ్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎలా అణచివేయాలో తమకు తెలుసని, వేరేవాళ్ల జోక్యం అనవసరమని ముషారఫ్ భారత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్‌కు అమెరికా దన్నుగా నిలుస్తుందనే అంశాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తాము అమెరికాకు అండగా నిలిచామని, అది మరువకూడదన్నారు.

More Telugu News