Telugudesam: నెక్ట్స్ వైసీపీలోకి ఫిరాయించేది ఓ కీలక మంత్రి... టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం!

  • ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు
  • వైసీపీలోకి వలసల వెల్లువ
  • జగన్ గూటికి చేరనున్న ఉత్తరాంధ్ర నేత?

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారు ఇప్పుడు జగన్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే మేడా మల్లికార్జున్ రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు వైసీపీ తీర్థం పుచ్చుకోగా, ఇప్పుడు ఏపీలో మరో నేత, మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తుండటం టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఆ నేత, ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు ఆదేశిస్తే, తాను వెనక్కు తగ్గుతానని వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీసింది. ఆయనకు ఈ దఫా టికెట్ ను ఆఫర్ చేయలేదని, అందువల్లే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రస్తుతం కీలక మంత్రి పదవిలో ఉన్న ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే, టీడీపీకి నష్టం అధికమేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

More Telugu News