రాయలసీమలో మొదలైన ఎండలు!

  • తిరుపతిలో 37 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
  • మరో వారంలో 40 డిగ్రీలను దాటవచ్చు
  • 3 డిగ్రీల వరకూ పెరిగిన రాత్రి ఉష్ణోగ్రత
  • కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షానికి చాన్స్
రాయలసీమలో ఒక్కసారిగా భానుడి ప్రతాపం మొదలైంది. కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీల వరకూ పెరిగిపోయాయి. కోస్తా ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలో నిన్న 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడ్డారు. మరో వారంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 2 నుంచి 3 డిగ్రీల వరకూ అధికమయ్యాయి.

అయితే, పడమర గాలులు వీస్తున్న కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రం రాత్రి పూట చలి కొనసాగుతోంది. వచ్చే రెండు రోజులూ రాయలసీమ, కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడి, తమిళనాడు వరకూ విస్తరించింది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కురవవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
Go Back to Shorts
Rayalaseema
Heat
Tirupati
Telangana
Rains

More Telugu News