East Godavari District: అంతకు ముందే కూతురి పెళ్లయింది.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి!

  • పెళ్లింట కొన్ని గంటల వ్యవధిలోనే తీరని విషాదం
  • పూలకోసం వెళ్తుండగా ఢీకొట్టిన ట్రాక్టర్‌
  • ఘటనా స్థలిలోనే మృత్యువాత

అప్పటి వరకు మంగళవాయిద్యాలు, పచ్చతోరణాలతో కళకళలాడిన ఇంట అంతలోనే చావు బాజా మోగింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి కుమార్తెను ఓ ఇంటిదాన్ని చేసిన తండ్రి పనిలో భాగంగా బయటకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో ఆ ఇంట విషాదం అలముకుంది.

 వివరాల్లోకి వెళితే...తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నానికి చెందిన ఈలి అర్జునరావు (53) తన కుమార్తె శ్రీదేవికి, బంధువుల్లోని ఓ యువకుడికి ఇచ్చాడు. రఘుదేవపురంలోని సాయిబాబా ఆలయంలో గురువారం తెల్లవారు జామున వీరి వివాహం ఇరువర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. వివాహం తంతు పూర్తయ్యాక వధూవరులను అన్నవరంలోని సత్యదేవుని దర్శనానికి పంపించారు.

తదుపరి పూజల కోసం కావాల్సిన పూలు, ఇతర సామగ్రి కొనుగోలు చేయాలని అర్జునరావు స్వగ్రామం పురుషోత్తపట్నానికి వెళ్లారు. సామగ్రి తీసుకుని ఉదయం ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నారు. గోదావరి గట్టు రహదారిలో వస్తుండగా వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్‌ అర్జునరావును ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ సమాచారంతో అప్పటి వరకు ఆనందోత్సాహాలతో కళకళలాడిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలముకుంది.

More Telugu News