Jammu And Kashmir: ఆత్మాహుతి దాడికి ప్పాలడిన ఉగ్రవాది ఇతడే... వీడియో విడుదల చేసిన జైషే మహ్మద్!

  • వీడియోలో రెచ్చగొట్టే ప్రసంగం
  • కశ్మీరీలంతా  కలసి రావాలన్న ఉగ్రవాది
  • ఎక్కడా భయమన్నదే లేని వైనం

పుల్వామా ఉగ్రదాడి ఘటన యావత్ భారతాన్ని కుదిపేసింది. సీఆర్పీఎఫ్ బలగాల కాన్వాయ్ పై జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ అనే ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 42 మంది వరకు చనిపోయిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రిపాలైన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. అయితే, పుల్వామా దాడికి తమదే బాధ్యత అని ప్రకటించుకున్న జైషే మహ్మద్ సంస్థ ఈమేరకు దాడికి పాల్పడిన అదిల్ అహ్మద్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో అదిల్ అహ్మద్ ఎంతో ఉద్వేగభరితంగా ప్రసంగించడం వంటి దృశ్యాలున్నాయి.

ఈ వీడియో అందరి ముందుకు వచ్చే సమయానికి తాను స్వర్గంలో ఉంటానంటూ ఆ ఉగ్రవాది చెప్పడం జైషే మహ్మద్ కరుడుగట్టినతనానికి ప్రతీకగా నిలుస్తోంది. చేతిలో ఆటోమేటిక్ ఆయుధాలు, పక్కనే జైషే మహ్మద్ పతాకం... ఇదీ అదిల్ అహ్మద్ ఆ వీడియోలో కనిపించిన విధానం. భారత్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న దక్షిణ కశ్మీరీలకు మద్దతుగా ఉత్తర, మధ్య కశ్మీర్ ప్రజానీకం కూడా కలిసి రావాలని పిలుపునిచ్చాడు అదిల్ అహ్మద్. కొందరు కమాండర్లను చంపినంత మాత్రాన జైషే బలహీనపడుతుందని భావించడం భారత్ అజ్ఞానానికి నిదర్శనం అని, అలాంటి భ్రమలను భారత్ తొలగించుకోవాలని అన్నాడు.

More Telugu News