Andhra Pradesh: అవంతి శ్రీనివాస్ ఇంటికెళ్లి వైసీపీలో చేరాలని ఆహ్వానించండి!: విశాఖ నేతలకు జగన్ ఆదేశం

  • మధ్యాహ్నం 2 గంటలకు అవంతితో వైసీపీ నేతల భేటీ
  • సాయంత్రం జగన్ ను కలుసుకోనున్న టీడీపీ నేత
  • భీమిలి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అంగీకారం

అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు, టీడీపీ నేత అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. ఈరోజు విశాఖపట్నం వైసీపీ నేతలను ఇంటికి పిలిపించుకున్న జగన్.. అవంతి శ్రీనివాస్ చేరికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయమై పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం ఈరోజు అవంతి శ్రీనివాస్ ను కలిసి పార్టీలోకి ఆహ్వానించాలని జిల్లా నేతలకు సూచించారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ నేతలు అవంతి శ్రీనివాస్ ను కలుసుకోనున్నట్లు తెలుస్తోంది.

తనకు భీమిలి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అవంతి టీడీపీ అధిష్ఠానాన్ని కోరగా, ముందస్తు హామీ ఇచ్చేందుకు హైకమాండ్ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే అవంతి శ్రీనివాస్ వైసీపీ నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. కాగా, అవంతికి భీమిలి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ అంగీకరించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. కాగా, వైసీపీ నేతలతో తన నివాసంలో భేటీ అనంతరం అవంతి శ్రీనివాస్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లో జగన్ తో భేటీ అవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

More Telugu News