Chandrababu: ఈ మూడు స్కీమ్స్ అద్భుతం... ఇక ఎన్నికలు ఏకపక్షమే, గెలిచేది మనమే: చంద్రబాబు

  • పెన్షన్లు, పసుపు - కుంకుమ, రైతు సాయం గెలిపిస్తాయి
  • ఎన్నికలకు ముందే పొత్తులు పెట్టుకోవాలి
  • టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబునాయుడు

వృద్ధులకు సంవత్సరానికి రూ. 24 వేలు, పసుపు - కుంకుమ కింద మహిళలకు ఇచ్చే రూ. 20 వేలు, ప్రతి రైతు కుటుంబానికి ఇవ్వనున్న రూ. 10 వేలు అద్భుతమైన పథకాలని, ఈ పథకాలతో రానున్న ఎన్నికలు ఏకపక్షంగా సాగుతాయని, గెలిచేది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, జాతీయ పార్టీల నేతలతో చర్చిస్తున్నామని, ఎన్నికలకు ముందుగానే పొత్తులు పెట్టుకోవాల్సి వుందని అన్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు మెచ్చుకుంటున్నారని అన్నారు. పార్టీలోకి వచ్చేవారు వస్తుంటారని, పోయేవారు పోతుంటారని, అవకాశవాదులకు టీడీపీలో స్థానం లేదని హెచ్చరించారు. రైతులకు సాయం చేసే విషయమై కేంద్రం పలు షరతులను విధించిందని, దానికన్నా మెరుగ్గా మన ప్రభుత్వం సాయం చేయనుందని అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ప్రజా సంక్షేమాన్ని వదల్లేదని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా టీడీపీదేనని అన్నారు.

More Telugu News