Secunderabad: అనుమానం వెంటాడడంతో.. భార్యను లాడ్జ్ కి పిలిచి మరీ హత్య!

  • దుబాయ్ నుంచి భార్యను హత్య చేసేందుకు వచ్చిన రహీమ్
  • సికింద్రాబాద్ ప్రాంతంలో లాడ్జ్ లో దిగి హత్య
  • ఆపై పోలీసులకు ఫోన్ చేసి పారిపోయిన రహీమ్

తన భార్య మరెవరితోనో గడుపుతోందన్న అనుమానం పెంచుకున్న ఓ భర్త, దుబాయ్ నుంచి వచ్చి, లాడ్జిలో దిగి, ఆమెను పిలిపించి హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గద్వాల ప్రాంతానికి చెందిన రహీమ్ (27) అనే వ్యక్తి ఉద్యోగం నిమిత్తం దుబాయ్ కి వెళ్లాడు. ఆయన భార్య నఫీజ్ బేగం (24) ఇక్కడే ఉంటోంది.

తాను లేకపోవడంతో ఆమె మరొకరితో వివాహేతర బంధం పెట్టుకుందని, ఇతరులతో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేదని అనుమానం పెంచుకున్న రహీమ్, పలుమార్లు ఫోన్లోనే గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో మంగళవారం నాడు పక్కా ప్లాన్ వేసుకుని దుబాయ్ నుంచి వచ్చిన రహీమ్, సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ లాడ్జ్ లో బసచేసి, భార్యను రమ్మని చెప్పాడు. ఆపై ఆమెను కలిసి లాడ్జ్ కి తీసుకెళ్లి గొడవ పెట్టుకుని దారుణంగా హత్య చేశాడు.

 ఆపై పోలీసులకు ఫోన్ చేసి, మరో మార్గం కనిపించక తన భార్యను హత్య చేశానని చెప్పాడు. పోలీసులు అక్కడికి చేరుకోవడానికి నిమిషాల ముందు లాడ్జ్ ని వదిలి పరారయ్యాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆమె బంధువులకు సమాచారం ఇచ్చి, నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.

More Telugu News