T-congress: ఇవి రాహుల్, మోదీ మధ్య జరిగే ఎన్నికలు: టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్

  • పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు పాటుపడాలి
  • అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు తీసుకుంటున్నాం
  • ఎన్నికల హామీల అమలులో మోదీ విఫలమయ్యారు

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల గురించి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మండల, జిల్లాల స్థాయి నాయకులతో ఈరోజు ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం తమ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపు నిచ్చారు. అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు తీసుకుంటున్నామని, ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించామని అన్నారు. త్వరలో జరగనున్న ఈ ఎన్నికలు రాహుల్, మోదీ మధ్య జరిగే ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు.

ఎన్నికల హామీలు అమలు చేయడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని, ఆయన అధికారంలోకొచ్చాక దేశ ప్రగతి దిగజారిందని విమర్శించారు. దేశంలోని మైనార్టీలను అభద్రతా భావంలోకి నెట్టారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాహుల్ ప్రధాని అయితే దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ అమలు చేస్తారని అన్నారు. కాగా, హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఉత్తమ్ నిర్వహించారు.

ఈ నెల 15న ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, వరంగంల్ లో, 16న నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, 17న మెదక్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గాలపై సమీక్షించనున్నట్టు వివరించారు.

More Telugu News