Chandrababu: దీక్షతో బీజేపీ మోసాన్ని దేశానికి తెలియజేయగలిగాం: చంద్రబాబునాయుడు

  • పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌
  • ఆంధ్రా భవన్‌ ఎప్పుడూ రాజకీయాలకు వేదికే
  • ప్రధానికి అనుకూలంగా మాట్లాడడంతోనే వైసీపీ బండారం బయటపడింది

రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లడంలో ధర్మపోరాట దీక్షతో సఫలమయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దీక్ష ముగిసిన అనంతరం ఈరోజు ఆయన పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రధాని మోసాన్ని, బీజేపీని ఎండగట్టడంలో దీక్ష ద్వారా విజయవంతమయ్యామని నేతలకు వివరించారు.

అయితే ఇంతటితో అయిపోలేదని, ఈ పోరాటాన్ని ఆపకుండా ఇక్కడి నుంచే నేరుగా ప్రజల్లోకి వెళ్లి పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ చచ్చిన పాముతో సమానమని, దాన్ని ఇంకా కొట్టి లాభం లేదన్నారు. ప్రధాని మోదీకి మనం గౌరవం ఇవ్వడం లేదని వైసీపీ నేతలు మాట్లాడడంతోనే బీజేపీతో వారి బంధం బయటపడిందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును తాకట్టుపెడుతున్న జగన్‌ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సూచించారు. బురద పాములాంటి వైసీపీ, బీజేపీతో కలిసి కుట్రలు పన్నుతోందని, దీన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు.

More Telugu News