Andhra Pradesh: ఈరోజు దేశంలో చంద్రబాబు హీరో అయ్యారు!: బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా ప్రశంసలు

  • చంద్రబాబు కొన్ని నియమాలకు కట్టుబడే వ్యక్తి
  • అందుకే ఏపీకి అన్యాయంపై ఉద్యమిస్తున్నారు
  • చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు సంఘీభావం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. బీజేపీయేతర పార్టీలన్నీ ఈ దీక్షకు తమ మద్దతును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రెబెల్ నేతలు శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హాలు కూడా చంద్రబాబు దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా శత్రుఘ్నసిన్హా సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈరోజు చంద్రబాబు దేశంలో హీరో అయ్యారని ప్రశంసించారు. చంద్రబాబు కొన్ని నియమాలకు కట్టుబడే వ్యక్తని వ్యాఖ్యానించారు. అందువల్లే ఏపీకి జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు గళమెత్తారని అభిప్రాయపడ్డారు.

అసలు విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని కేంద్రాన్ని శత్రుఘ్న సిన్హా ప్రశ్నించారు. తాను బీజేపీలోనే ఉన్నప్పటికీ ధర్మపోరాట దీక్షకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. కాగా, చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఈరోజు రాత్రి 8 గంటలకు ముగియనుంది.

More Telugu News