Chandrababu: చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు సర్వం సిద్ధం.. మరికాసేపట్లో ప్రారంభం

  • 8 గంటలకు చంద్రబాబు దీక్ష ప్రారంభం
  • వేలాదిగా తరలివస్తున్న కార్యకర్తలు
  • హాజరుకానున్న జాతీయ పార్టీల నేతలు

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏపీ భవన్‌లో చంద్రబాబు దీక్షకు కూర్చోనున్నారు.

దీక్షలో పాల్గొనేందుకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో ప్రత్యేక హోదా నినాదం హోరెత్తనుంది. ఈ దీక్షకు కాంగ్రెస్ సహా పలు జాతీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. వివిధ పార్టీల నేతలతోపాటు జేఏసీ, విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావి సంఘాల ప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

దీక్షలో పాల్గొనేందుకు వచ్చే వారికి 800 గదులు, బస్సులు, ఆహారం ఏర్పాటు చేసినట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. ఏర్పాట్ల కోసం మొత్తం రూ. 80 లక్షలు ఖర్చు అయినట్టు పేర్కొన్నారు. దీక్ష అనంతరం మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు చంద్రబాబు సహా పదిమంది నేతలు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో భేటీ అవుతారని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.

More Telugu News