Andhra Pradesh: 14వ వివాహ వార్షికోత్సవం.. ట్విట్టర్ లో రొమాంటిక్ గా స్పందించిన మహేశ్ బాబు!

  • 2005, ఫిబ్రవరి 10న మహేశ్-నమ్రత వివాహం
  • నమ్రతకు వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రిన్స్
  • మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా మహేశ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల వివాహం జరిగి నేటికి సరిగ్గా 14 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రిన్స్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘అనుకోకుండా ఈ ఫొటోను తీశారు. అప్పుడే పెళ్లయి 14 ఏళ్లు అయిపోయాయి. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మై లవ్’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు నమ్రతతో కలిసి దిగిన ఓ ఫొటోను జతచేశారు. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు మహేశ్-నమ్రత దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ తీసిన ‘వంశీ’ సినిమాలో నమ్రత తొలిసారి మహేశ్ కు పరిచయమయ్యారు. ఇది కాస్తా ప్రేమగా మారడంతో నాలుగేళ్ల డేటింగ్ అనంతరం ఈ జంట 2005, ఫిబ్రవరి 10న ముంబైలోని మారియట్ హోటల్ లో పెళ్లి చేసుకుంది. అతడు షూటింగ్ సమయంలో మహేశ్ పెళ్లి జరిగింది.  మహేశ్-నమ్రత దంపతులకు గౌతమ్ అనే కుమారుడు, సితార అనే కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం మహేశ్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘మహర్షి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

More Telugu News