modi: మోదీది పిచ్చి తుగ్లక్ చర్య: చంద్రబాబు

  • ప్రధాని పదవిని చూసే మోదీకి గౌరవం ఇచ్చాను
  • మోదీ మారారని మద్దతు ఇచ్చాను
  • నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య

తన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ప్రధాని మోదీకి ఆయన పదవిని చూసే గౌరవమిచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని... గుజరాత్ లో మోదీ ప్రభుత్వం ముస్లింలను ఊచకోత కోస్తే... తొలుత వ్యతిరేకించింది తానేనని చెప్పారు. మోదీ రాజీనామా చేయాలని తాను డిమాండ్ చేశానని అన్నారు. మోదీ మారాడని భావించి పొత్తు పెట్టుకున్నామని... కానీ, నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఏదో ఇచ్చామని మోదీ చెబుతున్నారని... ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

యూటర్న్ తీసుకున్నానని తనను మోదీ విమర్శిస్తున్నారని... రాష్ట్రానికి అన్యాయం చేశారనే బాధతోనే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని... తనది యూటర్న్ కాదని, రాష్ట్రం కోసం తీసుకున్న నిర్ణయమని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సినవి అడిగితే, ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నారని అన్నారు. మోదీ అంటే తనకు భయం లేదని... సీబీఐ కేసులున్న జగన్ భయపడతారని చెప్పారు. రాజధానికి, పోలవరంకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన డబ్బులను కూడా వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. తెలంగాణకు డబ్బులు ఇచ్చారని... మనం ఊడిగం చేయడం లేదనే మనకు ఇవ్వడం లేదని అన్నారు. మోదీ చేసిన నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 

More Telugu News