jeweller: 33 ఏళ్ల క్రితం రూ.925కు ఉంగరం కొన్న మహిళ.. ఇప్పుడు దాని విలువ రూ. 6.8 కోట్లు!

  • మూడు దశాబ్దాలుగా వేలికి కోట్ల రూపాయల ఉంగరం
  • సాధారణ గాజు ఉంగరంగానే భావించిన మహిళ
  • అమ్మేందుకు వెళితే అసలు విషయం వెలుగులోకి

ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం ఓ ఉంగరాన్ని కొందామె. మెరిసిపోతున్న గాజు ఉంగరాన్ని ముచ్చటపడి పది పౌండ్లు ( రూ.925) కొనుగోలు చేసింది. కానీ అప్పుడామెకు తెలీదు.. తాను కొన్నది ఓ వజ్రమని, దాని ఖరీదు కోట్లలో ఉంటుందని. ఇప్పుడా విషయం తెలిసి ఆనందం పట్టలేకపోతోంది.

బ్రిటన్‌కు చెందిన 55 ఏళ్ల డెబ్రా గొడార్డ్‌ తన వేలికి కోట్ల రూపాయల విలువైన ఉంగరం ముప్పై ఏళ్లుగా ఉన్నా ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయింది. సాధారణ గాజుతో చేసిన ఉంగరంగానే దానిని భావించింది. అయితే, ఇటీవల ఆమె తల్లి ఓ మోసగాడి బారినపడి డబ్బు కోల్పోయింది. దీంతో కొంతైనా అవసరం తీరుతుందన్న ఉద్దేశంతో డెబ్రా తన వేలికి ఉన్న ఉంగరాన్ని అమ్మేయాలని నిర్ణయించుకుంది.

దానిని ఓ నగల వ్యాపారి వద్దకు తీసుకెళ్తింది. ఉంగరాన్ని పరీక్షించిన నగల వ్యాపారి 26.27 కేరెట్ల డైమండ్ అని, దీనికి రూ.6.8 కోట్లు (7,40,000 పౌండ్లు) వస్తుందని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ‘‘కొంతైనా డబ్బు వస్తుందన్న ఉద్దేశంతో నగల వ్యాపారికి దానిని ఇచ్చా. అతడు దానిని పరీక్షించి ‘‘నీకు తెలుసా? ఇదేంటో. ఇదో వజ్రం. దీని విలువ రూ. 6.8 కోట్లు’’ అని చెప్పేసరికి నోట మాటరాలేదు. రాత్రంతా దానినే చూస్తూ కూర్చున్నా. ఏం చేయాలో అర్థం కాలేదు’’ అని గొడార్డ్ చెప్పుకొచ్చింది.

నగల వ్యాపారి దానిని వజ్రమని నిర్ధారించిన వెంటనే ఆమె ఉంగరాన్ని ఆక్షన్ హౌస్‌కు తీసుకెళ్లి వేలం వేయాలని భావించింది. అక్కడ కూడా దానిని వజ్రంగానే నిర్ధారించారు.

More Telugu News