Andhra Pradesh: చంద్రబాబూ.. మోదీ పర్యటన అంటే ఎందుకంత భయం.. అవినీతి బయటపడుతుందనా?: కన్నా లక్ష్మీనారాయణ

  • అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపగలరా? 
  • ట్విట్టర్ లో టీడీపీ అధినేతపై మండిపాటు
  • గుంటూరు ప్రజా చైతన్య సభకు తరలిరావాలని పిలుపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ప్రధాని మోదీ గుంటూరు పర్యటన అనగానే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మోదీ వస్తే తన అవినీతి బయటపడుతుందని బాబు భావిస్తున్నారని దుయ్యబట్టారు.

ఈ రోజు ట్విట్టర్ లో కన్నా స్పందిస్తూ.. ‘@ncbn ఎందుకింత భయం!? అరచేతిని అడ్డంపెట్టి సూర్యుడిని ఆపగలరా!? మోదీ గారి సభకు మీరు, మీ పచ్చ నాయకులు ఎన్ని అడ్డంకులు కల్పించినా ప్రజలను మీరు ఆపగలరా? మోదీ గారు వస్తే మీ అవినీతి బయటపడుతుందనా!? మీ అబద్ధాల పచ్చ మీడియా రాతలు ఇక ప్రజలు నమ్మరు అని భయమా! సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేశారు.

అలాగే రేపు గుంటూరులో ప్రధాని మోదీ సభను ఉద్దేశించి ‘నిజం పిలుస్తోంది అసత్యాన్ని ఆపమంటూ...నిజం గెలుస్తుంది అవినీతిని చీల్చుకుంటూ.. నవ్యాంధ్ర ను ప్రగతి వైపు నడిపించిన మోదీ గారికి మద్దతుగా.. బీజేపీ ప్రజా చైతన్య సభే వేదికగా..తెలుగుదేశం@JaiTDP సృష్టిస్తున్న ఆటంకాలను లెక్కచేయక "సత్యమేవ జయతే" అని గర్వంగా నినదిస్తూ.. రండి..తరలి రండి’ అని ప్రజలకు, బీజేపీ శ్రేణులకు కన్నా పిలుపునిచ్చారు.

More Telugu News