Andhra Pradesh: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తల్లీకుమారుల మృతి, తండ్రి పరిస్థితి విషమం!

  • జిల్లాలోని బుడంపాడు వద్ద ఘటన
  • ట్రాక్టర్ దగ్గర నిద్రిస్తుండగా ఢీకొట్టిన మరో వాహనం
  • కేసు నమోదుచేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుడంపాడు దగ్గర జాతీయ రహదారి పక్కనే ఆగిఉన్న ట్రాక్టర్ ను ఓ గుర్తుతెలియని వాహనం ఈరోజు తెల్లవారుజామున బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ దగ్గరే నిద్రిస్తున్న యాదమ్మ(32), ఆమె కుమారుడు చరణ్(10) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో యాదమ్మ భర్త దుర్గయ్యకు తీవ్రగాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు దుర్గయ్యను మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరంతా నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. దుర్గయ్య ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందన్నారు.

More Telugu News