Kanna Lakshminarayana: మంత్రి లోకేశ్ కార్యాలయం నుంచి బెదిరింపులు రావటం దారుణం: కన్నా లక్ష్మీనారాయణ

  • మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి
  • పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ యత్నం
  • రాష్ట్రానికి ఏం చేశామనేది ప్రధాని వివరిస్తారు

ప్రధాని మోదీ ఈ నెల 10న గుంటూరుకు రానున్న సందర్భంగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. నేడు ఆయన గుంటూరులోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. గుంటూరులో మోదీ పర్యటనకు సంబంధించిన హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తుంటే మంత్రి లోకేశ్ కార్యాలయం నుంచి బెదిరింపులు రావటం దారుణమన్నారు.

మోదీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా బహిరంగ సభను విజయవంతం చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే డ్రామాలు ఆడటం దురదృష్టమని.. కనీసం ప్రధానికి స్వాగతం పలకలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉండటం సిగ్గు చేటని కన్నా విమర్శించారు. గుంటూరులో జరగబోయే బహిరంగ సభలో దేశానికి, రాష్ట్రానికి ఏం చేశామనేది ప్రధాని తన ప్రసంగంలో వివరిస్తారని కన్నా తెలిపారు.

More Telugu News