Kurnool District: కర్నూలు టీడీపీ టికెట్ నా కుమారుడికే దక్కుతుంది: టీజీ వెంకటేశ్ ధీమా

  • భరత్ కర్నూలులో కచ్చితంగా గెలుస్తాడు
  • గెలిచే అభ్యర్థులకే అధిష్ఠానం టికెట్ కేటాయిస్తుంది
  • చంద్రబాబు నిర్ణయం మేరకే నడుచుకుంటాం

వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ను టీడీపీ అధిష్ఠానం ఎవరికి కేటాయిస్తుందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి నుంచి టికెట్ తమకే లభిస్తుందని ఆశావహులు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఈ టికెట్ ను  కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్ ఆశిస్తున్నారు.

 ఈ క్రమంలో కర్నూలు నియోజకవర్గం టికెట్ తన కొడుకుకి లభించడం ఖాయమని టీజీ వెంకటేశ్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడు భరత్ కర్నూలులో కచ్చితంగా గెలుస్తాడని, అతనికే టీడీపీ అధిష్ఠానం మొగ్గుచూపుతుందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థులకే అధిష్ఠానం టికెట్ కేటాయిస్తుందని చెప్పిన టీజీ, ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబసభ్యుల గురించి ప్రస్తావించారు. సీఎం చంద్రబాబుని కేఈ కుటుంబ సభ్యులు ఇటీవల కలిశారని, వారు కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు వార్తల ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. కర్నూలు టికెట్ కేటాయింపు విషయంలో చంద్రబాబు నిర్ణయం మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు.

More Telugu News