priyanka gandhi: పెళ్లి అయినా.. భార్యతో కలసి ఉన్న ఒక్క ఫొటో కూడా లేదు: మోదీపై సంజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు

  • ప్రియాంకగాంధీ, రాబర్ట్ వాద్రాల అనుబంధం కలకాలం ఉంటుంది
  • వీరిని ఎన్నో వివాదాల్లోకి లాగినా.. బీజేపీ నిరూపించలేకపోయింది
  • రేపు ఈడీ ముందుకు మోదీ కూడా వస్తారు

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి అయినప్పటికీ భార్య జశోదా బెన్ తో మోదీ కలసి ఉన్న ఒక్క ఫొటో కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రియాంకాగాంధీ, రాబర్ట్ వాద్రాల అనుబంధం కలకాలం ఉంటుందని చెప్పారు. ఎన్నో వివాదాల్లోకి వీరి పేర్లను లాగినప్పటికీ... వాటిని బీజేపీ నిరూపించలేక పోయిందని అన్నారు.

విదేశాల నుంచి ప్రియాంకాగాంధీ తిరిగి వచ్చిన సందర్భంగా, ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల రాహుల్ గాంధీ, ప్రియాంక, రాబర్ట్ వాద్రాలు కలసి ఉన్న పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ పోస్టర్లను న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) తొలగించింది. ఈ నేపథ్యంలోనే, మోదీపై సంజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఆయన మరో వ్యాఖ్య చేశారు. ఈడీ ముందు ఈరోజు రాబర్ట్ వాద్రా విచారణకు హాజరవుతున్నారని... రేపు ఈడీ ముందుకు మోదీ వెళ్లాల్సి వస్తుందని అన్నారు. 2009లో జరిగిన పెట్రోలియం డీల్ కు సంబంధించిన కేసులో ఈరోజు ఈడీ ముందు రాబర్ట్ వాద్రా హాజరుకానున్నారు. మరోవైపు, మనీ లాండరింగ్ కేసులో ఫిబ్రవరి 16 వరకు ఢిల్లీలోని ఓ కోర్టు రాబర్ట్ వాద్రాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

More Telugu News