Telangana: వేధిస్తున్నాడని షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశాం.. అందుకే కొబ్బరి బోండం కత్తితో మధులికపై దాడి చేశాడు!: బాధితురాలి తల్లి

  • ఏడాదిన్నరగా భరత్ వేధిస్తున్నాడు
  • కౌన్సెలింగ్ ఇచ్చాక మధులిక జోలికి రానన్నాడు
  • కఠినంగా శిక్షించాలని డిమాండ్

తమ కుమార్తె మధులికను నిందితుడు భరత్ గత ఏడాదిన్నర కాలంగా వేధిస్తున్నాడని బాధితురాలి తల్లి తెలిపారు. ఈ విషయమై తాము షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశామనీ, అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారని అన్నారు. తాను ఇకపై మధులిక జోలికి వెళ్లబోనని పోలీసులకు హామీ ఇచ్చిన భరత్.. ఈ దారుణానికి తెగబడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కక్ష పెంచుకున్న భరత్ తమ కుమార్తెపై దాడి చేశాడన్నారు. ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలనీ, మరో అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

బర్కత్ పురాలోని సత్యానగర్ కు చెందిన మధులిక ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో ప్రేమించాలని భరత్ వెంటపడినప్పటికీ బాధితురాలు ఒప్పుకోలేదు. దీంతో నిందితుడు ఈరోజు బాధితురాలిపై కొబ్బరి బోండాల కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల, మెడ, ఎడమ చేతికి తీవ్రమైన గాయాలు కావడంతో మధులిక కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

More Telugu News