Prakasam District: పదేపదే ప్రియుడితో పారిపోతున్న కుమార్తెను దారుణంగా చంపిన తండ్రి!

  • ప్రకాశం జిల్లా తాళ్లూరు సమీపంలో ఘటన
  • ప్రియుడితో పారిపోతే ఇంటికి తెచ్చిన తండ్రి
  • వాదోపవాదాలు పెరిగి హత్య!

ప్రియుడు పిలిచాడని తిరుపతికి వెళ్లింది. విషయం తెలుసుకున్న తండ్రి ఇంటికి తీసుకు వచ్చి మందలించాడు. తర్వాత మళ్లీ స్నానానికి వెళుతున్నానని చెప్పి, దొడ్డిదారిన ఉడాయించి ప్రియుడితో కలిసి మార్కాపురం వెళ్లిపోయింది. తండ్రి మళ్లీ నచ్చజెప్పి తెచ్చాడు. ఇలా ఎన్నిమార్లు చెప్పినా, మందలించినా, వినకుండా ఇల్లొదిలి పోతూ, కుటుంబం పరువుతీస్తోందన్న ఆగ్రహం, ఆ తండ్రిని కర్కశకుడిగా మార్చగా, కుమార్తె గొంతునులిమి చంపాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు సమీపంలోని కొత్తపాలెంలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన కోట వెంకటరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. రెండో కుమార్తె వైష్ణవి (20), ఒంగోలులోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతోంది. రోజూ కాలేజీ బస్సులో వెళ్లే ఆమె, లింగసముద్రం ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. గత గురువారం నాడు, బస్సులో ఇంటికి వస్తూ, ఆసుపత్రికి వెళుతున్నానని చెప్పిన ఆమె, ప్రియుడితో కలిసి తిరుపతికి వెళ్లింది.

 ఈ విషయం తెలుసుకున్న తండ్రి, ఆమెను తిరిగి తీసుకువచ్చి నచ్చజెప్పాడు. ఆ మరుసటిరోజే స్నానం చేసి వస్తానని అంటూ వెళ్లి, మరోమారు పరారైంది. ఈ దఫా ఆమె, మార్కాపురం ప్రాంతంలో ఉందని తెలిసి మళ్లీ తెచ్చారు. నలుగురూ కలిసి మంచి చెప్పబోతే, వైష్ణవి రెచ్చిపోయింది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, వెంకటరెడ్డి ఆగ్రహం కట్టలుతెచ్చుకుంది. ఆమెపై చెయ్యిచేసుకున్నాడు.

ఈ క్రమంలో నిన్న తెల్లవారుజామున, తన కుమార్తె ఆరోగ్యం బాగాలేదంటూ, స్థానిక ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించగా, ఆప్పటికే ఆమె మరణించింది. ముఖంపై గాయాలు, ఆమె గొంతు నులిమి ఉన్నట్టు కనిపించడంతో, ఆమె హత్యకు గురైందన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News