Tollywood: ‘నువ్వు ఎవడివిరా అడగడానికి?' అంటూ కౌశిక్ రెడ్డి నాపై దాడి చేశాడు: హీరో రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్

  • గత శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది
  • పార్కింగ్ కు మా అనుమతి తీసుకుంటే బాగుండేదన్నా
  • కౌశిక్ రెడ్డి నాపై దుర్భాషలాడి దాడి చేశాడు

ప్రముఖ హీరో రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ పై దాడి జరిగిన విషయమై ఫిర్యాదు చేసేందుకు బంజారాహిల్స్ లోని ఏసీపీ కార్యాలయానికి జీవితా రాజశేఖర్, గుణశేఖర్ ఈరోజు సాయంత్రం వెళ్లారు. అనంతరం, మీడియాతో బాధితుడు గుణశేఖర్ మాట్లాడారు. ఈ ఘటన గురించి వివరించి చెప్పారు.

గత శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తన షోరూమ్ గుణాస్ డైమండ్స్ పార్కింగ్ స్థలంలో కౌశిక్ రెడ్డి తన కారును పార్కింగ్ చేసి ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పారు. తమ పార్కింగ్ స్థలంలో ఓ కారు ఉంటే, ఎవరి కారు ఇది? అని సెక్యూరిటీని ప్రశ్నిస్తే, తనకు తెలియదని సమాధానమిచ్చాడని చెప్పారు. ఆ కారు కోసం ఎవరైనా వస్తే తనను పిలవమని ఆ సెక్యూరిటీకి చెప్పానని, కొద్ది సేపటి తర్వాత ఆ కారుకు సంబంధించిన వ్యక్తి కౌశిక్ రెడ్డి వచ్చారని అన్నారు. కారు పార్కింగ్ చేసి వెళ్లడం తప్పు కాదు, భద్రత కారణాల దృష్ట్యా మా అనుమతి తీసుకుంటే బాగుండేదని కౌశిక్ రెడ్డితో తాను అన్నట్టు పేర్కొన్నారు.

‘నువ్వు ఎవడివిరా అడగడానికి? మేము తెలంగాణ వాళ్లం’ అంటూ బూతులు మాట్లాడి, దాడి చేశారని గుణశేఖర్ వాపోయారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ కూడా తన వద్ద వుందని చెప్పారు. రోజూ వచ్చి ఇక్కడే తన కారును పార్క్ చేస్తానని, అవసరమైతే, తన షాపును లేపేస్తానంటూ ఏదేదో మాట్లాడాడని ఆరోపించారు.

ఆరడుగుల ఎత్తులో ఓ మృగంలా ఉన్న అతన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోయామని అన్నారు. తన గొంతు పట్టుకుని తనపై దాడి చేశాడని, వాచిపోవడంతో తాను మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. నిన్నంతా తీవ్రమైన జ్వరంతో బాధపడ్డానని, జరిగిన విషయాన్ని తానెవరికీ చెప్పలేదని అన్నారు. ఈరోజు ఉదయం నుంచే కొంచెం మాట్లాడగలుగుతున్నానని, దీంతో, జరిగిన విషయాన్ని తన అన్నయ్య రాజశేఖర్ కి ఫోన్ చేసి చెప్పానని తెలిపారు.

More Telugu News