Andhra Pradesh: పాపం వెంకయ్య నాయుడు.. ఆయనకు ప్రమోషన్ ఇచ్చారో.. పనిష్మెంట్ ఇచ్చారో తెలియడం లేదు!: చంద్రబాబు

  • బీజేపీ నేత రాజుపై  చంద్రబాబు ఆగ్రహం
  • ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారని మండిపాటు
  • దక్షిణాది నుంచి ఒక్క కేంద్ర మంత్రీ లేడని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఏపీకి అన్నీ ఇచ్చామని చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త రాష్ట్రం వస్తే మద్దతు ఇవ్వాల్సింది పోయి కేసులతో వేధించుకుని తింటున్నారని మండిపడ్డారు. దక్షిణాది నుంచి ఒక్క కేంద్ర మంత్రి అయినా మోదీ కేబినెట్ లో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ..‘వెంకయ్య నాయుడు దక్షిణాది నుంచి ఒకే ఒక కేంద్ర మంత్రిగా ఉండేవాడు. ఆయన అన్ని రాష్ట్రాలకు తిరిగేవాడు. ఆయన్ను కూడా పదవి నుంచి తీసేసి ఉప రాష్ట్రపతిని చేసేశారు. ఎంత అసూయ అధ్యక్షా.. పాపం వెంకయ్య నాయుడు. ఆయనకు ప్రమోషన్ ఇచ్చారో, లేక పనిష్మెంట్ ఇచ్చారో ఆ దేవుడికే తెలియాలి. దక్షిణాది నుంచి ఒక్కరైనా కేంద్ర మంత్రి ఉన్నారా? దత్తాత్రేయ ఉంటే ఆయన్ను తీసేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాది వ్యక్తికి ప్రధాని పదవి పోతే, దక్షిణాదికి రాష్ట్రపతి పదవి ఇచ్చి బ్యాలెన్స్ చేసేవారు’ అని చెప్పారు.

More Telugu News