Jammu And Kashmir: కశ్మీర్ లోకి చొరబడ్డ జైషే ఉగ్రవాదులు.. ఇద్దరిని కాల్చిచంపిన భద్రతాబలగాలు!

  • పుల్వామాలోని రాజ్ పొరాలో ఎన్ కౌంటర్
  • కార్డన్ సెర్చ్ చేపట్టిన భద్రతా బలగాలు
  • తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం

జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య నిన్న రాత్రి మొదలైన ఎన్ కౌంటర్ ముగిసింది. నిషేధిత జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు ఈరోజు కాల్చిచంపాయి. ఈ ఘటన పుల్వామా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాజ్ పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాలు భద్రతా బలగాలకు సమాచారం ఇచ్చాయి.

దీంతో రంగంలోకి దిగిన బలగాలు.. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. అయితే భద్రతా బలగాలు తమను చుట్టుముట్టినట్టు గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

ఈరోజు ఉదయం వరకూ సాగిన ఈ ఎన్ కౌంటర్ లో జైషేకు చెందిన షాహిద్ అహ్మాద్, అనియత్ అహ్మద్ లు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు ఘటనాస్థలం నుంచి ఎస్ఎల్ఆర్, పిస్టళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News