Hyderabad: బాలిక, బాలుడిపై యువకుడి అత్యాచారం.. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన హైదరాబాద్ కోర్టు

  • నిందితుడిని దోషిగా తేల్చిన మెట్రోపాలిటన్ కోర్టు
  • 13 ఏళ్ల బాలికపై, ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం
  • 2016 ఆగస్టులో ఘటన

ఐదేళ్ల బాలుడిపైనా, 13 ఏళ్ల బాలికపైనా అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 ఏళ్ల నిందితుడిని దోషిగా తేల్చిన హైదరాబాద్ కోర్టు పదేళ్లు, ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రెండింటినీ ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించింది.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.ప్రతాప్ రెడ్డి కథనం ప్రకారం.. ఆగస్టు 23, 2016న 13 ఏళ్ల బాలికపై పాన్‌షాపు యజమాని అయిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కాసేపటికే కంచన్‌బాగ్‌లో ఐదేళ్ల బాలుడిపై దారుణానికి ఒడిగట్టాడు. తన తండ్రి కోసం కిళ్లీ కొనేందుకు వచ్చిన బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత కొన్ని గంటలకే చాక్లెట్ల ఆశచూపి ఐదేళ్ల బాలుడిపై అత్యాచారానికి తెగబడ్డాడు. అదే ఏడాది ఆగస్టు 27న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసు పూర్వాపరాలను విచారించిన మొదటి అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి నిందితుడిని దోషిగా తేల్చారు. బాలుడిపై అత్యాచారానికి పాల్పడినందుకు గాను పదేళ్ల కఠిన కారాగార  శిక్ష, బాలికపై జరిపిన దారుణానికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

More Telugu News