Chandrababu: నాలుగున్నరేళ్లు జులాయిగా తిరిగిన చంద్రబాబు.. ఇప్పుడు కష్టపడుతున్నాననడం హాస్యాస్పదం: జీవీఎల్

  • కియా మోటార్స్‌కూ, చంద్రబాబుకూ సంబంధం లేదు
  • చంద్రబాబు దుబారా చేస్తున్న సొమ్ము ప్రజలది
  • ‘పీఎంఈవై’ కింద లక్షల ఇళ్లను నిర్మిస్తోంది

కియా మోటార్స్‌కూ, ఏపీ సీఎం చంద్రబాబుకూ సంబంధం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. నేడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే కియా మోటార్స్ ఏపీకి వచ్చిందని వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్లు జులాయిగా తిరిగిన చంద్రబాబు ఇప్పుడు కష్టపడుతున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు దుబారా చేస్తున్న సొమ్ము ప్రజలదని.. సోకులు చేసుకోవడానికి కాదని.. కేంద్రం ప్రకటించిన రూ.900 కోట్ల నిధులను కరవు ప్రాంతాలకే వాడాలని అన్నారు.

ఈ ఖర్చులపై నిఘా ఉంటుందని జీవీఎల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మారుస్తోందని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లక్షల ఇళ్లను నిర్మిస్తోందని తెలిపారు. టీడీపీలో చేరే వారంతా ప్యాకేజీల కోసమేనని జీవీఎల్ విమర్శించారు. అఖిల పక్ష సమావేశంలో చంద్రబాబు ఏకాకిలా మిగిలారని.. రెండు పార్టీలను కూడా కలుపుకోలేని చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం పోరాడుతారని ప్రశ్నించారు.

More Telugu News