Andhra Pradesh: పదేళ్లలో ఏపీ నంబర్ వన్: నరసింహన్

  • ప్రజలు సంతృప్తి పడేలా పాలన
  • శ్రామికులకు 90 శాతం రాయితీతో పనిముట్లు
  • పోలవరంకు గిన్నిస్ గుర్తింపు వచ్చింది
  • ఉభయ సభలను ఉద్దేశించి నరసింహన్

మరో పదేళ్లలో ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా అవతరిస్తుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్ అంచనా వేశారు. ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, రాబోయే ఐదేళ్లలో ప్రజలు సంతృప్తి పడే విధంగా పాలన సాగించేందుకు సాంకేతికతను సాయంగా తీసుకోనున్నామని, ఇప్పటికే విజన్ తయారైందని చెప్పారు. పలు వర్గాల శ్రామికులకు 90 శాతం రాయితీతో పనిముట్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తనదేనని చెప్పారు.

ఇటీవలే పోలవరం ప్రాజెక్ట్‌ కాంక్రీట్ పనులకు గిన్నిస్‌ గుర్తింపు వచ్చిందని చెప్పిన ఆయన, త్వరలోనే పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టుల పనులను పూర్తి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ నిమిత్తం జిల్లాల వారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, 11 బీసీల కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు.

రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని తన ప్రభుత్వం నిర్ణయించిందని, అతి త్వరలోనే రెండు విడతల్లో రుణమాఫీకి చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. ఏపీని కరవు రహిత ప్రాంతంగా నిలపడమే తమ లక్ష్యమని నరసింహన్ వ్యాఖ్యానించారు.

More Telugu News