India: ఇండియాపై మరిన్ని పాక్ ప్రేరిపిత ఉగ్రదాడులు: అమెరికా

  • మరిన్ని దాడులకు పొంచివున్నారు
  • ఉగ్రవాదంపై పోరుకు పాక్ సహకరించడం లేదు
  • వెల్లడించిన యూఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డాన్ కోట్స్

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇండియాపై మరిన్ని దాడులకు పొంచివున్నారని అమెరికా హెచ్చరించింది. ఇండియాతో పాటు ఆఫ్గనిస్థాన్ పైనా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డాన్ కోట్స్ వెల్లడించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికా జరుపుతున్న పోరాటానికి కూడా పాకిస్థాన్ సరైన సహకారాన్ని అందించడం లేదని ఆయన ఆరోపించారు.

తాము సురక్షితంగా ఉండాలని భావిస్తున్న ఉగ్రవాదులు, తమ దేశం మద్దతుతో పొరుగు దేశాలపై దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా జరిగే దాడులను తాము ఎదుర్కొంటామని తెలిపారు. సెనేట్ సెలక్ట్ కమిటీతో సమావేశమైన కోట్స్, సీఐఏ డైరెక్టర్ జెనా హాస్పెల్, ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ వారే, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ డైరెక్టర్ రాబర్ట్ ఆష్లే తదితరులతో అంతకుముందు సమావేశమయ్యారు. ఈ సంవత్సరం మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రపంచ ప్రజలు సిద్ధంగా ఉండాలని అన్నారు.

More Telugu News