rahul gandhi: గోవా ముఖ్యమంత్రితో భేటీ అయిన రాహుల్ గాంధీ

  • గోవాలో వ్యక్తిగత పర్యటనలో ఉన్న రాహుల్
  • సీఎం కార్యాలయంలో భేటీ
  • ఇది పూర్తిగా వ్యక్తిగతమన్న రాహుల్

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు కలుసుకున్నారు. గోవాలో వ్యక్తిగత పర్యటనలో ఉన్న రాహుల్... ముఖ్యమంత్రి కార్యాలయంలో పారికర్ తో భేటీ అయ్యారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రాహుల్ వెల్లడించారు. 'ఈ ఉదయం గోవా ముఖ్యమంత్రి పారికర్ ను కలుసుకున్నాను. అనారోగ్యం నుంచి ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. ఈ మధ్యాహ్నం కేరళ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో నేను మాట్లాడబోతున్నా. దీనికి సంబంధించి నా ఫేస్ బుక్ పేజ్ లో లైవ్ చూడవచ్చు' అంటూ ట్వీట్ చేశారు.

పాంక్రియాస్ సంబంధిత వ్యాధితో మనోహర్ పారికర్ బాధపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు, రాఫెల్ డీల్ కు సంబంధించిన ఫైళ్లు పారికర్ వద్ద ఉన్నాయంటూ రాహుల్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారానికి సంబంధించి బాంబులాంటి ఫైళ్లు పారికర్ దగ్గర ఉన్నాయని చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సైతం పారికర్ పేరును ప్రస్తావించి సభలో రాహుల్ కలకలం రేపారు.

More Telugu News