Ground Nut Oil: పల్లీ నూనె పేరిట కోట్లు నొక్కేసిన శ్రీకాంత్ అరెస్ట్!

  • రూ. లక్ష కడితే పల్లీల నుంచి నూనెను తీసే మెషీన్
  • ప్రజల నుంచి కోట్లు దండుకున్న శ్రీకాంత్
  • ఈ ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు

లక్ష రూపాయలు కడితే పల్లీల నుంచి నూనెను తీసే మెషీన్ ను ఇస్తామని, ప్రతి నెలా పల్లీ నూనె తీసిస్తే, నెలకు రూ. 20 వేలు సంపాదించుకోవచ్చని ప్రజలను నమ్మించి, కోట్లాది రూపాయల డిపాజిట్లు వసూలు చేసి, బోర్డు తిప్పేసిన గ్రీన్‌ గోల్డ్‌ బయోటెక్‌ ఎండీ శ్రీకాంత్‌ ను మంగళవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. రూ. లక్ష కట్టిన తమకు తొలుత డబ్బులు సక్రమంగానే చెల్లించిన శ్రీకాంత్, ఇప్పుడు డబ్బివ్వకుండా మోసం చేస్తున్నారన్న బాధితుల ఫిర్యాదు మేరకు, ఉప్పల్ పోలీసులు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

సుమారు వారం రోజుల పాటు దర్యాఫ్తు చేసిన పోలీసులు, శ్రీకాంత్ ప్రజలను మోసం చేశాడని తేల్చారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీకాంత్‌, గతంలోనూ పలు ఆకర్షణీయమైన స్కీములను ప్రకటించి, ప్రజలను మోసం చేశాడని గుర్తించారు. అతనిపై గతంలోనే బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారని, ఇప్పుడు అతని అరెస్ట్ తో పాత కేసులనూ విచారిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. 

More Telugu News