Tamil Nadu: ప్రేమ మత్తులో రహస్యం చెప్పేసిన ప్రియురాలు.. అదే సాకుతో పెళ్లి ఆపేసిన పెద్దలు!

  • తనకు ఒక కిడ్నీ మాత్రమే ఉందన్న ప్రియురాలు
  • పెళ్లికి అది అడ్డం కాబోదన్న ప్రియుడు
  • దానినే సాకుగా చూపించి పెళ్లి ఆపేసిన పెద్దలు

ఈ వార్త చదివాక ప్రేమలో కూడా రహస్యాలు తప్పనిసరి అన్న నిర్ణయానికి వస్తారేమో. ప్రేమ మత్తులో పూర్తిగా మునిగిన ఆమె తనకు తప్ప మరెవరికీ తెలియని రహస్యాన్ని ప్రియుడితో పంచుకుంది. అయితే, అదే తన జీవితానికి పెద్ద శాపంగా మారుతుందని అప్పుడు ఆమె ఊహించలేకపోయింది.

తమిళనాడులోని అలందూరుకు చెందిన విఘ్నేశ్ వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయమైన అమ్మాయితో పీకలోతు ప్రేమలో మునిగిపోయాడు. రెండేళ్ల పాటు ఇద్దరూ ఫుల్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత విషయాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అదే ఊపులో తనకు పుట్టినప్పటి నుంచి ఓ కిడ్నీ లేదన్న రహస్యాన్ని ప్రియుడి వద్ద యువతి బయటపెట్టేసింది.

కిడ్నీ లేకపోవడం పెళ్లికి సమస్య కాదని చెప్పిన ప్రియుడు పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లికి ముహూర్తం కూడా కుదిరింది. ఆ తర్వాత కొన్ని రోజులకే యువతి తండ్రి హఠాత్తుగా చనిపోయాడు. ఇదే యువతి కష్టాలకు కారణమైంది. యువతి తండ్రి చనిపోయిన తర్వాత విఘ్నేశ్ కుటుంబం ప్లేటు మార్చింది.

తమకు 20 తులాల బంగారాన్ని కట్నంగా ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటామని విఘ్నేశ్ కుటుంబం డిమాండ్ చేసింది. తండ్రి చనిపోవడంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్నామని, అంత బంగారం ఇవ్వలేమని యువతి వేడుకుంది. దీంతో ఈసారి మరో కొత్త నాటకానికి విఘ్నేశ్ కుటుంబం తెరతీసింది.

కిడ్నీలేని అమ్మాయికి తమ కుమారుడిని ఇచ్చి పెళ్లి చేసేది లేదని తెగేసి చెప్పింది. మరో కిడ్నీ వేయించుకుంటేనే పెళ్లి జరుగుతుందని, అప్పటి వరకు పెళ్లి ప్రసక్తే లేదని కరాఖండీగా చెప్పేసింది. దీంతో బాధిత బాలిక కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News